అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ‘కరోనా భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకొని హైదరాబాద్లో దాక్కున్నారు పెద్ద/చిన్న నాయుడు. 60 నుంచి వందేళ్ల వృద్ధులు కూడా పంచాయితీ ఎన్నికల్లో ఓటేయాలని అంటున్నారు. టీడీపీ బతకదని తెల్సు కాబట్టి ఏపీ ప్రజలు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారు. వీళ్లు మనుషులా, రాక్షసులా?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘గేదెకు లేని బాధ గుంజకెందుకో? అన్నట్టుంది నిమ్మగడ్డ వ్యవహారం. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్నందున ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగులు మొరపెట్టుకున్నా ససేమిరా అన్నాడు. చివరకు న్యాయం గెలిచింది. వ్యాక్సినేషన్ డ్రైవ్కు ఆటంకాలు తొలిగిపోయాయని’ మరో ట్వీట్లో పేర్కొన్నారు.