అహ్మదాబాద్ : ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో కనిపించి ఆశ్చర్యపరిచిన మోనోలిత్ రాయి ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షమైంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఒక పబ్లిక్ పార్క్ వద్ద ‘మిస్టీరియస్ మోనోలిత్’ ని చూసినట్లు ప్రజలు చెప్పారు. ఇది 6 అడుగుల పొడవుతో ఏకశిలా లోహంతో తయారైనట్లుగా ఉన్నది. భారతదేశంలో ఇటువంటి ఏకశిలా చూసిన మొదటి ప్రాంతం ఇదే.అహ్మదాబాద్లోని తల్తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్ వద్ద ‘మిస్టీరియస్ ఏకశిల’ నిర్మాణం కనిపించింది. దీనిని సాధారణంగా స్థానికులు ‘మిస్టరీ మోనోలిత్’ అని పిలుస్తారు. లోహ నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తుంది. అయితే, దీనిని తవ్విపెట్టినట్లుగా సంకేతాలు ఏవీ దాని బేస్ వద్ద కనిపించకపోవడం విశేషం. పార్క్ లోపల ఎవరైనా నిర్మాణాన్ని ఉంచడాన్ని తాను చూడలేదని పార్క్ తోటమాలి ఆశారాం చెప్పారు. “సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అది అక్కడ లేదు. మరుసటి రోజు ఉదయం తిరిగి పనికి తిరిగి వచ్చినప్పుడు ఈ విచిత్ర నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయాను” అని ఆశారాం తెలిపారు. అనంతరం విషయాన్ని గార్డెన్ మేనేజర్కు వివరించగా.. ఆయన కూడా ఆశ్చర్యంతో చూసినట్లుగా ఆశారం పేర్కొన్నారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా ఉండి.. దాని ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయాలను కనుగొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అహ్మదాబాద్లో మిస్టీరియస్ మోనోలిత్ గురించి వైరల్ కావడంతో ఈ ప్రదేశం కాస్తా పర్యాటక ప్రాంతంగా మారింది. ఫొటోలు, సెల్ఫీలను క్లిక్ మనిపించడానికి ప్రజలు పోటీపడ్డారు.ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో ఇలాంటి ఏకశిలలు కనిపించాయి. అమెరికాలోని ఉటా ఎడారిలో తొలుత ప్రత్యక్షమైనట్లు నివేదించబడింది. అనంతర కాలంలో రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్, యూకే, కొలంబియాలో కూడా ఇలాంటి ‘మిస్టరీ ఏకశిల’ నిర్మాణాలు కనిపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని చూసిన అహ్మదాబాద్లోని పార్కును అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పీపీపీ మోడ్ కింద ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ నిర్మాణం గురించి మున్సిపల్ కార్పొరేషన్ లేదా ప్రైవేట్ సంస్థకు ఇంతవరకు తెలియదు.
