న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా 2021 రిపబ్లిక్ డే పరేడ్లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా చర్యలను చేపట్టింది. 15 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు గణతంత్ర దినోత్సవ వేడులకు అనుమతించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి ఏడాది 1,15,000 మంది పరేడ్ వేడుకలకు హాజరయ్యేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 25వేలకు కుదించారు. చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రద్దు చేసింది కేంద్రం. ఎర్రకోట ముందు త్రివిధ దళాలు చేసే పరేడ్ను తొలిసారిగా రద్దు చేసింది. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పరేడ్ను అనుమతించింది. దీంతో గతంలో 8.2 కిలోమీటర్ల మేర సాగే త్రివిధ దళాల కవాతు.. 3.3 కిలోమీటర్లకే పరిమితం కానున్నది. పరేడ్లో పాల్గొనే సైనికులు, ఇతరులు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈసారి పరేడ్లో ఉండే బృందాల్లో సభ్యుల సంఖ్యను కూడా 144 మంది నుంచి 96కు తగ్గించింది.