రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మరదలిపై బావ కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమె వేరొకరి బైక్ ఎక్కడంతో తట్టుకోలేకపోయాడు. అంతే ఆమెను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ రూరల్ మండలంలోని ల్యాబర్తి శివారు పస్యానాయక్ తండాకు చెందిన సునీత, వనిత(30) అక్కా చెల్లెళ్లు. సునీత యాకుబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వనిత శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వనిత భర్త శంకర్ మరణించాడు. అప్పట్నించి ఆమె ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారి బాగోగులు చూసే నెపంతో యాకూబ్ మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే జనవరి 22 శుక్రవారం నాడు వనిత వేరే వ్యక్తితో బైక్ పై వెళ్లటం చూసిన యాకూబ్ కోపంతో రగిలిపోయాడు. మరదలు మరోక వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోయాడు.తట్టుకోలేక ఆమెకు ఫోన్ చేసి రాయపర్తిలో ఆగమని చెప్పాడు. అక్కడికి వెళ్లి తన ఇంటికి వెళ్దామని చెప్పి టేకుల తండా శివారులో ఉన్న తన పొలంలోకి తీసుకు వెళ్లాడు.అక్కడ ఆమెపై పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచాడు. తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ తో ఆమె గొంతులో పొడిచి చంపేశాడు. అనంతరం శవాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లాడు. హత్య చేసిన విషయాన్ని భార్యకు తెలిపాడు. రాత్రి 8 గంటల సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి వనిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో వేసుకుని డీసీతండా శివారులోని ఎస్సారెస్సీ కాలువలో పడేశారు. అయితే మూడు రోజుల తర్వాత వనిత మృతదేహాం మైలారం రిజర్వాయర్ లో తేలింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బావ యాకూబ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. యాకుబ్, సునీతలపై కేసు నమోదు చేసి యాకూబ్ ను రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు. పరారీలో ఉన్న సునీత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వనిత హత్యకు గురవ్వడంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.
