చిత్తూరు జిల్లా మదనపల్లె మరోసారి వార్తల్లోకెక్కింది. విద్యాధిక దంపతులు, క్షుద్రపూజల పేరిట కన్నకూతుళ్లను హత్య చేసిన ఘటన మరువక ముందే… ఇదే ప్రాంతంలో మరో ఘాతుకం జరిగింది. మనసారా ప్రేమించిన పాపానికి 18 ఏళ్ల యువతి తన ప్రాణాలు పోగొట్టుకుంది. మదనపల్లె మండలం మంగళం పంచాయతీలో జరిగింది ఈ దారుణం.మదనపల్లెకు చెందిన ఉమ, కొన్నాళ్లుగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటోంది. అదే ఏరియాకు చెందిన రామాంజనేయులు ఉమపై కన్నేశాడు. ఆమెతో చనువుగా ఉన్నాడు. ప్రేమిస్తున్నానంటూ కబుర్లు చెప్పాడు. రామాంజనేయులు మాట నమ్మిన ఉమ.. అతడ్ని ప్రేమించింది. అలా 6 నెలలు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత ఉమ స్వస్థలం మదనపల్లె చేరుకున్నారు. అప్పట్నుంచి ఉమకు వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కనీసం మనిషిగా కూడా చూడలేదు రామాంజనేయులు. ఈ క్రమంలో గురువారం ఉదయం పూటుగా మద్యం సేవించి మరోసారి ఉమను హింసించాడు రామాంజనేయులు. దారుణంగా కొట్టి చంపేశాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉమ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడను గట్టిగా అదిమిపట్టి హత్య చేసినట్టు ప్రాధమికంగా గుర్తించారు. ఉమను హత్య చేసిన అనంతరం, రామాంజనేయులు పరారయ్యాడు. దగ్గర్లోని హైవే వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ్నుంచి ఏదో వాహనంలో పరారయ్యాడు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఉమ నిండు ప్రాణాలు బలయ్యాయి
