లక్నో: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో హృదయవిధారకమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తాగుబోతు తండ్రి తన రెండు నెలల కొడుకును కర్రతో కొట్టిచంపాడు. అప్పటిదాకా తల్లి ఒడిలో ఆడుకుంటున్న ఆ చిన్నారి తండ్రి కొట్టిన బలమైన దెబ్బకు అక్కడికక్కడే విగతజీవిగా మారాడు. కన్న కొడుకు తన కళ్లముందే విలవిల్లాడుతూ ప్రాణాలు విడువడం చూసి ఆ తల్లి మనసు తల్లడిల్లింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలోని తానా భవన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దేవేందర్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అప్పటికే తన రెండు నెలల కొడుకును ఒడిలో వేసుకుని తలకు నూనె రాస్తున్న దేవేందర్ భార్య రేణు.. భర్త వాలకం చూసి ఈసడించుకుంది. రోజూ తప్పతాగి వస్తే ఇల్లెలా గడుస్తుందని ప్రశ్నించింది. దాంతో కోపంతో ఊగిపోయిన దేవేందర్ ఆమెపై కర్రతో దాడి చేశాడు.తాగిన మైకంలో ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఒక దెబ్బ రేణు ఒడిలో ఉన్న పసిబిడ్డకు తగిలింది. దాంతో పసిగుడ్డు కాసేపు విలవిల్లాడి తల్లి ఒడిలోనే కన్నుమూశాడు. ఆ హఠాత్పరిణామానికి బాలుడి తల్లి తల్లడిల్లింది. రక్తమోడుతున్న బిడ్డను హత్తుకుని రేణు రోధిస్తుండగానే నిందితుడు దేవేందర్ అక్కడ్నుంచి జారుకున్నాడు. రేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
