ప్రాణం తీసిన మద్యం మత్తు

ఇద్దరు యువకుల మద్యం మత్తు ఒక ఆశయాన్ని బలిగొంది..ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు ఎవరిపై ఆధారపడొద్దనుకున్న ఆయన ఆదర్శాన్ని దూరం చేసింది. ఆరుపదుల వయసు..గజగజ వణికించే చలిలో కూరగాయలు విక్రయించేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. పీకలదాకా తాగి, కారును అతివేగంగా నడుపుతూ ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు కన్నుమూశాడు. చూడటానికి సాధారణ ప్రమాదమే కావొచ్చు.. బాధ్యత మరిచిన ఇద్దరు యువకుల మద్యంమత్తుకు జీవితాన్ని గెలిచిన ఒక వృద్ధుడు అసువులు బాయటం అందరినీ కలిచివేస్తున్నది. చెట్టంత కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నా వారి మీద ఆధారపడకుండా నిత్యం కూరగాయలు అమ్ముతూ తనతోపాటు భార్యను పోషించుకుంటున్నాడు. వీఎస్టీ వద్ద శుక్రవారం తెల్లారగట్ల జరిగిందీ రోడ్డు ప్రమాదం. ఆ సమయంలో కారు 100 కి.మీ.స్పీడ్‌తో ఉండగా, ఇద్దరు యువకుల మద్యం మత్తు 200 మిల్లీగ్రాములు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టిన ఫలితమిది.

డిసెంబర్‌ 31… కాల గమనంలో ఒక ఏడాదికి వీడ్కోలు పలికే రోజు… అనుభవాల సారాంశంతో కొత్త ఏడాదిలో మరింత నూతనోత్తేజంగా విజయాల వైపు దూసుకుపోవాలనే ఆకాంక్షతో వేడుక జరుపుకుంటాం… కానీ కొందరు యువకులు ఆ వాస్తవాల్ని మరుస్తున్నారు… కొత్త ఏడాదిని కండ్లారా చూసే పరిస్థితి లేకుండా పీకలదాకా తాగి.. మత్తులో తూగుతున్నారు.. బాధ్యత కలిగిన పౌరులమని మరవడమే కాదు… అమాయకుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు.. ఇదే కోవలో గురువారం రాత్రి నుంచి తాగడమే పనిగా పెట్టుకున్న ఇద్దరు యువకులు… శుక్రవారం తెల్లవారుజామున ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఒక వృద్ధుడిని బలిగొన్నారు.

దోమలగూడ, జనవరి 1: దశాబ్దాలుగా కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాదు… కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది.. జీవితానికి సార్ధకత చేకూర్చుకున్నాడో ఓ వృద్ధుడు.. నెలకు వేల రూపాయల జీతాలు తెచ్చే చెట్టంత కొడుకులు ఇద్దరు ఉన్నా… తన ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు ఇతరులపై ఆధారపడని  పనిచేస్తూనే ఉన్నాడు.. ఇలా.. పనిచేస్తున్న క్రమంలోనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు సమీపంలోని వీఎస్టీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో నాగిరెడ్డి (60) అనే వృద్ధుడు మృతిచెందాడు. చూసేందుకు ఇదో సాధారణమైన రోడ్డు ప్రమాదమే కావ చ్చు… కానీ బాధ్యత మరిచిన ఇద్దరు యువకుల మద్యం మత్తుకు.. జీవితాన్ని గెలిచిన ఒక వృద్ధుడు అసువులు బాయటమనేది అందరినీ కలిచివేస్తున్నది.

ఆరు పదుల వయస్సులో కూడా…

దశాబ్దాలుగా నాగిరెడ్డి నగరంలోని సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతంలో చిక్కడపల్లిలో ఉంటూ ప్రతి రోజు తోపుడు బండిపై కూరగాయలు పెట్టుకొని మోండా మార్కెట్‌కు వెళ్లి విక్రయించేవాడు. ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకుంటూ… ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెను చదివించాడు. పైసా పైసా కూడబెట్టి పీర్జాదిగూడలో సొంత ఇల్లు కూడా కట్టుకోగా… కుటుంబమంతా అక్కడనే ఉంటుంది. పిల్లలందరూ మంచిగా చదువుకొని ప్రయోజకులయ్యారు. ముగ్గురికీ వివాహం కూడా అయింది. పెద్ద కొడు కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం కులో డ్యూటీ మేనేజర్‌గా పని చేస్తుండగా… చిన్న కొడుకు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయినప్పటికీ నాగిరెడ్డి మాత్రం ఆరు పదుల వయస్సు చేరినప్పటికీ కూరగాయలు అమ్ముతూ తనతో పాటు భార్యను పోషించుకుంటున్నాడు. ప్రతి రోజూ తెల్లారుజామున ఐదు గంటలకే పీర్జాదిగూడ నుంచి చిక్కడపల్లికి ద్విచక్ర వాహనంపై వచ్చి, ఆపై అక్కడ ఉండే తోపుడు బండిపై కూరగాయల్ని మోండా మార్కెట్‌కు తీసుకుపో యి అమ్ముతా డు. అదే రీతిన శుక్రవారం తె ల్లారుజామున 5గంటల సమయంలో చిక్కడపల్లి నుంచి మోండా మార్కెట్‌ వైపు తోపుడు బండిని తీసుకువెళుతున్న సమయంలో ఇద్దరు జులాయిల రూపంలో మృత్యువు కబళించి వేసింది.

అసలే మత్తు… ఆపై అతి వేగం…

నల్లకుంట పద్మ కాలనీకు చెందిన చక్రవర్తి కుమారుడు శ్రీవాస్తవ్‌ (21)  డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీవాస్తవ్‌.. తన స్నేహితుడు అచ్యుత్‌లో కలిసి గురువారం రాత్రి డిసెంబర్‌ 31న పార్టీ చేసుకున్నాడు. తెల్లారుజాము వరకు తాగి, టిఫిన్‌ చేసేందుకు ఇద్దరూ నల్లకుంట నుంచి స్విఫ్ట్‌( టీఎస్‌ 09 ఎఫ్‌జే 7029)లో విద్యానగర్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు బయలుదేరారు. తెల్లారుజామున సుమారు 5.20గంటల ప్రాం తంలో వీఎస్టీ దగ్గర తోపుడు బండిని తీసుకుపోతున్న నాగిరెడ్డిని ఢీకొట్టారు. ఈ సమయంలో కారు గంటకు వంద కిలోమీటర్ల వేగంగా వెళుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కారు ఢీకొట్టడంతో బలమైన గా యాలతో నాగిరెడ్డి అపస్మారక స్థితిలోకి పోయారు. చుట్టుపక్కల వారు వెంటనే  పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు వచ్చి పరిశీలించి.. అప్పటికే నాగిరెడ్డి మృతిచెందినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. అతి వేగం.. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమైన శ్రీవాస్తవ్‌, అతడి మిత్రుడు అచ్యుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు నాగిరెడ్డి కుమారుడు రాజేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు 304 (బీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

పీకలదాకా తాగి…

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు.. తమ విచారణలో భాగంగా కారు నడిపిన శ్రీవాత్సవ్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించారు. సాధారణంగా బీఏసీ 35 మిల్లీ గ్రాముల లోపు ఉండాలి… ఆపై ఉంటే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో భాగంగా కేసు నమోదు చేస్తారు. బీఏసీ వంద మిల్లీమీటర్లలోపు ఉంటే జరిమానా విధించి, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. వందకు పైబడితే చట్ట ప్రకారం జైలుశిక్ష కూడా విధించే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే.. శ్రీవాత్సవ్‌కు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరిశీలించినపుడు బీఏసీ ఏకంగా 200 మిల్లీగ్రాములు ఉండటమంటే పీకలదాకా తాగారనేది అర్థమవుతుంది.