గుజరాత్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని కేడియాలో చోటు చేసుకుంది. స్థానిక యువకుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన యువతిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తూ ఏడాదికిపైగా పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఉన్నట్లుండి గత 2 నెలలుగా యువకుడు ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: జిడ్డి లడ్కా పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కలిగిన 20 ఏళ్ల యువకుడు 2019 జూన్లో ఉజ్జయినికి చెందిన 22 ఏళ్ల యువతికి ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్ను యువతి యాక్సెప్ట్ చేయడంతో వారు తరచుగా చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే యువకుడు 2019 ఆగస్టులో బ్లేడుతో చేయి కోసుకున్న ఫొటోలను యువతికి పంపించాడు. యువతి తనను కలిసేందుకు అహ్మదాబాద్కు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.దాంతో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడిన యువతి అహ్మదాబాద్కు వెళ్లింది. అక్కడ ఆమెను ఓ హోటల్కు తీసుకెళ్లిన యువకుడు పెండ్లి చేసుకుందామంటూ మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. మూడు రోజులపాటు హోటల్లోనే ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం 2019 అక్టోబర్లో మరోసారి యువతిని అహ్మదాబాద్కు ఆహ్వానించి అత్యాచారం చేశాడు. ఈ విధంగా 2020 అక్టోబర్ వరకు సదరు యువకుడు యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే గత 2 నెలల నుంచి సదరు యువకుడు ముఖం చాటేయడంతో బాధిత యువతి మోసపోయానని గ్రహించింది. దీంతో ఉజ్జయిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, నేరం అహ్మదాబాద్లోని కేడియా ప్రాంతంలో జరిగినందున కేసును అక్కడికి బదిలీ చేశారు.
