రాష్ట్రంలోకి కొత్త కరోనా ఎంటరైంది. వరంగల్కు చెందిన ఓ వ్యక్తికి బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ సోకినట్టు హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్టేట్, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీలకు రిపోర్ట్ చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్లోని కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే కొత్త స్ట్రెయిన్ గురించి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని, అప్పటివరకు అఫీషియల్గా వెల్లడించలేమని పేర్కొన్నారు. కొత్త స్ట్రెయిన్ సోకిన ఈ వ్యక్తి ఈ నెల రెండో వారంలో బ్రిటన్ నుంచి వరంగల్ కు వచ్చారు. బ్రిటన్ రిటర్నీస్ అందరికీ టెస్టులు చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు, రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు ఈ నెల 24న ఆయనకు టెస్టులు చేయించారు. కరోనా పాజిటివ్గా రావడంతో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు. ఆ వ్యక్తికి సోకినది బ్రిటన్లో వేగంగా వ్యాపిస్తున్న స్ట్రెయిన్ అని సీసీఎంబీ సైంటిస్టులు తేల్చారు. అయితే మరోసారి జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు కోసం ఆ వ్యక్తి శాంపిళ్లను, మరికొందరు బ్రిటన్ రిటర్నీస్ శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబుకు పంపినట్టు తెలిసింది.
ప్రైవేటు హాస్పిటల్లో పేషెంట్స్:
బ్రిటన్ స్ట్రెయిన్ సోకిన వ్యక్తి వయసు 49 ఏండ్లు అని, ఆయన నుంచి తల్లికి వైరస్ వ్యాపించిందని అధికారులు తెలిపారు. శనివారం చేసిన టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని, ఆ శాంపిల్స్ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపామన్నారు. కొత్త కరోనా వచ్చిన వ్యక్తితో ముగ్గురు మాత్రమే కాంటాక్ట్ అయ్యారని అధికారులు గుర్తించారు. అందులో ఆయన తల్లికి పాజిటివ్గా తేలింది. అయితే ఆమె ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇతర పేషెంట్లతో కలవకుండా సెపరేట్ వార్డులో ఉంచారు. వారి హెల్త్ కండిషన్ నార్మల్గానే ఉందని, వైరస్ లక్షణాలు ఎక్కువగా లేవని ఆ ప్రైవేట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బ్రిటన్ స్ట్రెయిన్ సోకిన వారిని ప్రైవేటు హాస్పిటల్లో ఉంచడం ఏమిటని ప్రభుత్వ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కొత్త వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందని తెలిసి కూడా ప్రైవేటుకు పంపించడమేంటని పేర్కొంటున్నారు. నిజానికి బ్రిటన్ రిటర్నీస్ లో పాజిటివ్ వచ్చిన వారిని ఉంచేందుకు.. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాట్లు చేసినట్టు స్టేట్ హెల్త్ ఆఫీసర్లు ఈమధ్యే చెప్పారు కూడా. అయితే ఈ విషయంపై వరంగల్ హెల్త్ ఆఫీసర్లను ప్రశ్నించగా పేషెంట్ ఇష్టప్రకారమే ప్రైవేట్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడని అన్నారు.