ఇల్లందు ఓపెన్‌కాస్టులో ‘ఆచార్య’ క్లైమాక్స్‌ చిత్రీకరణ

భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్‌కాస్టులో ‘ఆచార్య’ సినిమా క్లైమాక్స్‌ సీన్‌లో భీకర పోరాట దృశ్యాల చిత్రీకరణ జరిగింది.క్లైమాక్స్‌ సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరించారు. హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌లు మిలిటరీ దుస్తుల్లో కనిపించారు. ఆచార్య సినిమాలో తండ్రీ తనయులు నటిస్తున్న విషయం విదితమే. ఈ నెల 11 వరకు జేకే 5 ఓసీలో భారీ పోరాట దృశ్యాలు చిత్రీకరించనున్నారు. 12న 21 ఇైంక్లెన్‌ అండర్‌గ్రౌండ్‌ మైన్‌లో తుది సన్నివేశాల షూటింగ్‌ జరుగనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన అండర్‌గ్రౌండ్‌ మైన్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు నిర్ణయించారు. ఇంతకుముందే చిత్ర దర్శకుడు ఇల్లెందు ఓపెన్‌కాస్టు, అండర్‌గ్రౌండ్‌ మైన్లను పరిశీలించి క్లైమాక్స్‌ ఘట్టాలను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్న సమయంలో చిరంజీవి ఓపెన్‌కాస్టుకు చేరుకున్నారు. సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సాయంత్రం జరిగిన పోరాట ఘట్టాల్లో రామ్‌చరణ్‌, చిరంజీవి పాల్గొన్నారు. చిత్ర యూనిట్‌ బృందానికి ఓపెన్‌కాస్టు వ్యూ పాయింట్‌ వద్ద సింగరేణి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సినిమా షూటింగ్‌ను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనుమతులు లేకపోవడంతో పోలీసులు నిరాకరించారు. కాగా షూటింగ్‌ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.