ప్రముఖ దర్శకుడుకి బ్రెయిన్‌డెడ్‌…విషాదంలో సినీ పరిశ్రమ

సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ఆ సినిమా దర్శకుడు గుండెపోటుతో బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. బుధవారం ఉదయం కోయంబత్తూరులో గాంధీరాజన్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే ఆయన కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ప్రస్తుతం మలయాళం దర్శకుడు నారాణిపుజ షాన్‌వాస్‌ వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.పాలక్కాడ్‌ జిల్లాలోని అట్టపాడి ప్రాంతంలో గాంధీరాజన్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. షూటింగ్‌కు అంతా సిద్ధమై టేక్‌ తీసుకునే సమయానికి ఆ సినిమా దర్శకుడైన షానవాస్‌ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనకు గుండెపై బాగా రుద్ది సపర్యలు చేశారు. అంబులెన్స్‌లో సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స ప్రారంభించారు. అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద వార్తను ఆ సినిమా నిర్మాత విజయ్‌బాబు ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కుటుంబసభ్యులు కూడా వెంట ఉన్నారని, అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని విజయ్‌బాబు తెలిపారు. ఆయన గుండె ఇంకా కొట్టుకుంటున్నదని, ఆయన ఆరోగ్యం కోసం అభిమానులు దేవుడ్ని ప్రార్థించాలని నిర్మాత కోరారు. ఏదైన మిరాకిల్‌ జరిగి షానవాస్‌ బ్రతుకుతాడాన్న ఆశ ఉన్నదని చెప్పారు.2015 లో కైరై సినిమాతో మలయాళం ఇండస్ట్రీలోకి వచ్చిన షానవాస్‌.. అదితిరావ్‌ హైదరీ, జయసూర్య, దేవ్‌మోహన్‌ నటించిన సూఫియం సుజాతాయుం అనే సినిమాతో దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ ఏడాది విడుదలైంది. దర్శకుడు షానవాస్‌ గుండెపోటుకు గురై బ్రెయిన్‌డెడ్‌ అయిన వార్త వినగానే పలువురు మలయాళం సినిమా పెద్దలు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని మరిన్ని మంచి సినిమాలు తేవాలని ఆకాంక్షించారు.