న్యూఢిల్లీ: హెల్త్కేర్, ఆటో, రోడ్ల రంగానికి నిధుల కేటాయింపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టడంతో స్టాక్ మార్కెట్లలో బుల్.. రంకేసింది. సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకే బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1700 పాయింట్లు దాటింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 14,100కు చేరువలో ఉంది. బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ సుమారు 4 శాతం పెరిగాయి.రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లు బ్యాంకుల షేర్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఆరు శాతం పెరిగితే ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు 11.06 శాతం దూసుకెళ్లింది. ప్రభుత్వ రంగ ఎస్బీఐ 7.11 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 11.16 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.69 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.10 శాతం, ఆర్బీఎల్ బ్యాంక్ 4.91 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.24 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2.40 శాతం పెరిగాయి.
