భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే వారి చర్యలను తిప్పికొడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఫైర్ రేంజ్, పరేడ్ గ్రౌండ్, బీఓఏసీని డీజీపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని పావులు కదుపుతున్న మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలను తిప్పికొడతామని అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని ఆయన కొనియాడారు. జిల్లా సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ర్టం నుంచి మావోయిస్టులు చొరబడకుండా ఇక్కడి పోలీసు అధికారులు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వారి చర్యలను నిర్మూలిస్తున్నారన్నారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలను ముందుకు తీసుకెళ్తూ, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రజలకు సహకారాన్ని అందిస్తోందన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో స్థానిక యువతకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
