హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్ల వేళలను ప్రభుత్వం పొడిగించింది. మద్యం దుకాణాలు గురువారం రాత్రి 12 గంటలదాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు. బార్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనుమతి ఉన్న దుకాణాలను గురు, శుక్రవారాల్లో అర్ధరాత్రి ఒంటిగంటదాకా తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ అనుమతులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
పర్మిట్ రూంలకు అనుమతి
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద ఉండే పర్మిట్ రూంలను తెరిచేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా పర్మిట్రూంలు మూసివేసిన విషయం తెలిసిందే.