హైదరాబాద్: గత ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేసి, పెట్టుబడులకు ముఖద్వారంగా నిలిపిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ అభివృద్ధిని ఇలానే కొనసాగించాలంటే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. ఆరేళ్ల కిందటి హైదరాబాద్తో పోల్చితే ప్రస్తుతం మనం చూస్తున్న భాగ్యనగరంలో ఎంతో పురోగతి ఉందన్నారు.
‘‘హైదరాబాద్ నగరంలో ఇంత అందమైన రహదారులు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా పరిస్థితులు, 24గంటల కరెంటు, శాంతి భద్రతలు ఉన్నాయంటే కారణం సీఎం కేసీఆర్ నాయకత్వమే. భవిష్యత్లోనూ నగరంలో ఇదే తరహా అభివృద్ధి కొనసాగాలి. ఈ బాధ్యత గ్రేటర్ ప్రజలపై ఉంది. భారత్లోనే బెస్ట్ సిటీగా వరుసగా ఐదుసార్లు హైదరాబాద్ నిలిచిందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ప్రకటించాయి. ఇలాంటి ర్యాంకులు, గొప్ప పరిస్థితులు కేవలం మాటలతో రావు. ఉత్తమ పాలన, ఎంతో కష్టపడితేనే సాధ్యమవుతాయి’’ అని కవిత వివరించారు.