ఫాస్టాగ్ గ‌డువు పొడిగించిన కేంద్రం…వాహనదారులకు ఊరట

న్యూఢిల్లీ: ఇప్ప‌టి వ‌ర‌కూ మీ వెహికిల్‌కు ఫాస్టాగ్ తీసుకోలేద‌ని ఆందోళ‌న చెందుతున్నారా? అయితే మీకు కేంద్ర ప్ర‌భుత్వం ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యం తీసుకుంది. ఈ గ‌డువును ఫిబ్ర‌వ‌రి 15, 2021 వ‌ర‌కు పొడిగించింది. నిజానికి జ‌న‌వ‌రి 1 నుంచే దేశ‌వ్యాప్తంగా అన్ని వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి అని డిసెంబ‌ర్ 24న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. ఇప్పుడా డెడ్‌లైన్‌ను కాస్త పొడిగించారు. 2016లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫాస్టాగ్ విధానం వ‌ల్ల టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర వాహ‌నాలు టోల్ చెల్లించ‌డానికి ఆగాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనివ‌ల్ల విలువైన స‌మ‌యం ఆదా అవుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌స్తోంది. డిసెంబ‌ర్ 1, 2017 నుంచి కొత్త ఫోర్ వీల‌ర్ వెహికిల్స్ రిజిస్ట్రేష‌న్‌కు ఫాస్టాగ్‌ను తప్ప‌నిస‌రి చేశారు.