హైదరాబాద్,తీస్మార్ న్యూస్:తెలంగాణలో డిసెంబర్ ఒకటి నుంచి బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ నవంబర్ నెలాఖరు వరకు ముగియనుంది. దీంతో ఫస్టియర్ తరగతులను వచ్చేనెల ఒకటి నుంచి ప్రారంభిస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. వర్సిటీ, అఫిలియేషన్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు షెడ్యూల్ ప్రకారం క్లాసుల నిర్వహణపై ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటికే బీటెక్ సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల నివాస సమీప కాలేజీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవి ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయని, వచ్చే జనవరిలో కొత్త సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు.